`బాహుబలి`రెండు భాగాలుగా విడుదలై సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా `బాహుబలి`. ఇదే కోవలో త్వరలో మరో `బాహుబలి` రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్.
`బాహుబలి-1`కి ముందు జరిగిన విషయాలు.. అంటే శివగామి శకం గురించి అన్నమాట.మాహిష్మతి సామ్రాజ్య విస్తరణలో శివగామి దేవి పాత్ర గురించి ఇందులో చూపించనున్నారు. అయితే ఇది సినిమా కాదు…. వెబ్ సిరీస్! ఓ ప్రముఖ సంస్థ `శివగామి` పేరుతో ఈ సిరీస్ను రూపొందిస్తోంది. ఇందుకోసం దాదపు 375 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఈ సిరీస్ను రాజమౌళి పర్యవేక్షణలో ప్రముఖ దర్శకుడు దేవ్ కట్టా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కోసం నటీనటుల ఎంపికలో దేవ్కట్టా బిజీగా ఉన్నాడని సమాచారం.
డబ్బింగ్ తో జపాన్లో ‘మగధీర’
రామ్ చరణ్ కెరీర్ను మలుపు తిప్పిన ‘మగధీర’ ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది.రామ్ చరణ్ని ‘మెగా పవర్ స్టార్’ ని చేసింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కింది ‘మగధీర’. పునర్జన్మల నేపథ్యంలో ఫాంటసీ కథాశంతో తెరకెక్కిన ‘మగధీర’ సినిమా రాజమౌళిని టాప్ డైరెక్టర్గా నిలిపింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.
‘బాహుబలి’ సినిమాతో రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్లో బాహుబలి చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు ‘మగధీర’ సినిమాను కూడా జపనీన్ భాషలతో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే గతంలోనే ‘మగధీర’ జపనీస్ సబ్టైటిల్స్తో అక్కడ రిలీజ్ అయ్యింది.కానీ ఆ సమయంలో రాజమౌళికి జపాన్లో ఎలాంటి ఇమేజ్ లేదు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి పేరు జపాన్లోనూ మారుమోగిపోయింది. అందుకే ‘మగధీర’ను డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారట.